కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్ 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో దాదాపు 40 రకాల వస్తువులపై జీఎస్టీ పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో 23 రకాల వస్తు సేవలపై జీఎస్టీ శ్లాబులను తగ్గించారు. ఇక ఈరోజు (జనవరి1 )నుంచి 23 రకాల వస్తుసేవలపై తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ తగ్గింపుతో సామాన్యుడికి కొంత ఊరట కలగనుంది. టీవీలు, సినిమా టికెట్లు మానిటర్లు, పవర్బ్యాంకులు ఇకపై చౌకగా లభిస్తాయి.
జీఎస్టీ తగ్గింపు ... నేటి నుంచి ఇవన్నీ ఇక చౌకే..అలాగే పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, ట్రాన్స్మిషన్ షాఫ్ట్, కప్పీలు, పునర్వినియోగ టైర్లు, వీడియో కెమెరా రికార్డర్లు, వీడియో గేమ్, డిజిటల్ కెమెరాలు, పరికరాలున్నాయి. సరుకు రవాణా విషయంలో ప్రస్తుతం విధిస్తున్న థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. ఇక 5 శాతం శ్లాబులో ఫ్లైయాష్ ఇటుకలు, ఊత కర్ర, సహజ బెరడు, చలువరాళ్లు, పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే నాన్–షెడ్యూల్డ్, చార్టర్డ్ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తించనుంది. జన్ధన్ యోజన ఖాతాదారు, ప్యాక్ చేసిన కూరగాయలతో పాటు తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు.