మహిళలు సైన్యంలో చేరడానికి ఉత్సాహం చూపించరని అందరూ భావిస్తారు. కానీ, అది తప్పని రుజువైంది. మన దేశ ఆర్మీలో మహిళా సైనికుల సంఖ్య చాలా తక్కువ. దానికోసం ప్రభుత్వం మహిళలు సైన్యంలో చేరేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆర్మీ మహిళా విభాగాల్లో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది. వంద పోస్టులకు రెండు లక్షల మందికి పైగా దఖాస్తు చేసుకున్నారు.
ఈ పోస్టులన్నీ యుద్ధ రంగంలో ప్రత్యక్షంగా తలపడే జవాను ఉద్యోగాలే కావడం విశేషం. 15 లక్షల మందితో మరొక బలమైన ఆర్మీ ( కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్) తయారు చేసేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రాల వారీగా 'మహిళా ప్రోవెస్ట్ యూనిట్'ను ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ కమిషన్ అధికారులతో 40 మంది సైనికులు ఉండేలా తయారు చేయబోతుంది. దీనికి సంబంధించి తుది ఆమోదముద్రకు దస్త్రం సిద్ధంగా ఉంది.
యుద్ధ క్షేత్రంలోకి మహిళలు..
ఇప్పటిదాకా భారతసైన్యంలో మహిళలను నియమించి కేవలం వారిని కార్యాలయాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు నేరుగా యుద్ధక్షేత్రంలో పాల్గొనే వీరికి కఠినమైన శిక్షణ ఇవ్వనున్నారు. నియామకాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ర్యాలీ ఈ నెలాఖరున బెల్గాంలో జరగనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 25 నుంచి మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీఎమ్పీకి సంబంధించి రానున్న 17 సంవత్సరాల సర్వీసుకు గానూ 1700 మందిని 'కింది స్థాయి ర్యాంకుల' కేటగిరి కింద నియమించేందుకు ఆర్మీ రంగం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రాంతాల్లో జన సమూహాల్ని నియంత్రణ చేసేందుకు, ముఖ్యంగా జమ్ముకశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో వీరిని వినియోగిస్తారు. ప్రస్తుతం సింగపూర్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎస్ లాంటి దేశాల్లో మహిళలు నేరుగా యుద్ధరంగంలో పాల్గొంటున్నారు.