అలనాటి నటి జమున మళ్ళీ వెండితెర మీద మెరవనున్నారు. దేవినేని సినిమాతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మాజీ దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న దేవినేని సినిమాలో జమున నటించనున్నారు. ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం నిన్న(బుధవారం) హైదరాబాద్ లో జరిగింది.
పూజా కార్యక్రమాల్లో నటి జమున పాల్గొన్నారు. జమున కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్ షాట్కి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా జమున మాట్లాడుతూ.. 'నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది. రిటైర్ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఈ సినిమాతోపాటుగా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను' అని వెల్లడించారు.