చాలా మంది బరువు తగ్గడం కోసం అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలను, చిరుధాన్యాల ఆహార పదార్ధాలను ఆహారంగా తీసుకుంటారు. అయితే వాటిని తినడం ద్వారా నిజంగానే బరువు తగ్గుతామా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఓసారి తెలుసుకుందాం!. గోధుమ రొట్టెలు తినడం ద్వారా బరువును తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ముడి బియ్యం కంటే జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంసకృత్తులు, పీచు పదార్థాలు ఎక్కువగా వుంటాయి. వాటిని కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుచేత ఆకలి వుండదు.
వాటిని తీసుకున్నంత మాత్రనా బరువు తగ్గమని వాటితో పాటు తీసుకునే కూర, పప్పు పరిమాణాన్ని బట్టి కూడా బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ధాన్యం రకంలో ప్రత్యేకమైన కొన్ని పోషకాలు ఉంటాయి. ఒకే ధాన్యపు వంటకాన్ని రోజూ తినకుండా, వివిధ రకాల ధాన్యాలనూ ఆహారంగా తీసుకుంటుండాలి, దీంతో పాటు ఆకుకూరలు, కాయకూరలు ఎక్కువగా తినడం మంచిది. వెన్న తీసిన పాలు, పెరుగు తీసుకుంటు శారీరక వ్యాయామం చేయాలి. అలాగే తగినంత నిద్రపోవాలని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియం కణజాలాలు ఉత్తేజంగా పనిచేసేలా చేస్తుంది. పాలు, పెరుగు, పనీర్, కోడిగుడ్లు, పాలకూర, క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితరాల్లో కాల్షియం విరివిగా లభిస్తుంది, ఎముకల బలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు.