మంచి కలర్ ఫుల్ లుక్ ఇచ్చే బైక్ మీద రైడ్ చేస్తే.. ఆ మజానే వేరు అనే కుర్రకారు ఉన్నారు. అలాంటి వారికోసం బండి బాడీ మీద ఆకు పచ్చ కలర్తో మంచి లుక్ వచ్చే బైక్ ని రిలీజ్ చేసింది టీవీఎస్ కంపెనీ. అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ 100 రోడ్డుల మీద రైయ్ మంటూ తిరగటానికి రెడీ అయింది. అయితే ఈ బైక్ అన్ని బైకుల్లాంటిది కాదు. ఎందుకంటే ఇది ఇథనాల్తో నడుస్తుంది. దేశంలోనే ఈ తరహా శ్రేణిలో ఇదే ఫస్ట్ బైక్.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఇప్పటికే భారతీయ రోడ్లపై పరుగులు పెడుతుంది. అయితే ఇప్పుడు ప్లంబింగ్, ఫ్యుయెల్ ఇంజెక్షన్, ఈసీయూల్లో కొద్దిగా మార్పులు చేసి ఈ100గా మార్కెట్ లోకి తీసుకొచ్చారు. డిజైన్, ఇంజిన్, టెక్నాలజీ విషయాల్లో ఎలాంటి మార్పుల్లేవు. బండి బాడీ మీద ఆకుపచ్చ డెకాల్స్ డిజైన్ అదనంగా వచ్చి చేరింది. రూ.1.20 లక్షలు ధర ఉన్న ఈ బైక్ లీటరుకి 45కి.మీ. వరకు మైలేజీ ఇస్తుంది. ఇంజీన్ కెపాసిటీ 197.75సీసీ కలిగిన ఈ బైక్ స్వచ్ఛమైన ఇథనాల్ తో నడుస్తుంది.
ఇథనాల్.. చెరకు, మొక్కజొన్న, జొన్నల పిప్పి, వ్యర్థాలతో తయారవుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధనం. 35శాతం తక్కువ కార్బన్ మోనాక్సైడ్ విడుదల చేస్తుంది. హానికరమైన సల్ఫర్ డయాక్సైడ్ రేణువుల విడుదల తగ్గిస్తుంది. దీనివల్ల ఇంజిన్ వేడెక్కే సమస్య ఉండదు. ఇక ఈ ఇథనాల్ ధర లీటరు యాభై రూపాయలే. అన్నింటికన్నా ముఖ్యంగా దీని వాడకంతో రైతులకు ప్రయోజనం. అయితే ప్రస్తుతానికైతే ఇథనాల్ బంక్లు అందుబాటులో లేవు. చెరకు పరిశ్రమల యజమానులకు ఇథనాల్ తయారు చేసి అమ్ముకునేలా అనుమతినిచ్చింది ప్రభుత్వం. భవిష్యత్తులో సర్కారే ఈ బంక్లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.