నాన్వెజ్ ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చూస్తాయి. ఫలితంగా రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. రొయ్యల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పళ్ళు, ఎముకలు దృఢంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
కావలసిన పదార్ధాలు :
రొయ్యలు: అరకిలో
పసుపు: 2 టీస్పూన్లు
కారం: అరటీస్పూను
ఉప్పు: టీస్పూను
గ్రేవీ కోసం:
మామిడికాయ: ఒకటి
పచ్చికొబ్బరి: కప్పు
చింతపండు: చిన్న నిమ్మకాయంత
పసుపు: టీస్పూను
ఎండుమిర్చి: మూడు
మిరియాలపొడి: రుచికి సరిపడా
దనియాలు: టీస్పూను
ఉల్లిపాయ: ఒకటి
నూనె: టీస్పూను
తయారీ విధానం :
ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడగాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు రొయ్యలకు పట్టించి సుమారు అరగంటసేపు ఉంచాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. పచ్చికొబ్బరి, పసుపు, చింతపండు, మిరియాలు, దనియాలు, ఎండుమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓ మందపాటి గిన్నెలో రొయ్యలు, మామిడికాయ ముక్కలు వేసి సుమారు అరకప్పు నీళ్లు పోసి, రుబ్బిన గ్రేవీ మిశ్రమం రెండు టేబుల్స్పూన్లు వేసి పది నిమిషాలు ఉడికించాలి. తరవాత మిగిలిన గ్రేవీ వేసి తగినన్ని నీళ్లు పోసి మీడియం మంట మీద మరో పది నిమిషాలు ఉడికించాలి. ఓ పాన్లో నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేగాక అందులో కూర వేసి కలపాలి. మామిడి రొయ్యల కూర రెడీ.