బొప్పాయి రుచిలోనే కాదు. ఆరోగ్యానికీ మంచి ఔషధం. బొప్పాయి పండు తింటే అంధత్వం దరి చేరదు. రోజూ తీసుకునే పండ్లలో బొప్పాయి ఉండేలా చూసుకోవాలి. బొప్పాయి పండులో ఉండే సహజ పీచు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచి... అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు దాడి చేయకుండా చూస్తుంది. బొప్పాయిలో పీచు ఎక్కువ. కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. రోజూ తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నా అదుపులోకి వస్తుంది. దీన్నుంచి అందే కెలొరీలూ తక్కువే. ఈ పండు రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయంటారు నిపుణులు.
దీంట్లో ఉండే పీచు, విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా అడ్డుకుంటాయి. మధుమేహం ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇందులో చక్కెరశాతం తక్కువగా ఉండటమే కారణం. బొప్పాయి పండు పంటి నొప్పినీ తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల బారిన పడకుండా కాపాడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. బొప్పాయిలోని పోషకాలు క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. ఈ పండు నుంచి విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో అందుతుంది. దీన్ని తరచూ తీసుకుంటే కంటి సమస్యలు ఎదురుకావు. దీన్ని తినడం వల్ల ఒత్తిడీ అదుపులో ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు.