ఒక ఎలక్ట్రిక్ బైక్ లు ఇప్పటికే రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోఉన్నాయి. తాజాగా ఎలక్ట్రిక్తో నడిచే విమానాలు గాల్లో ఎగరడానికి రెడీ అయ్యాయి. త్వరలోనే ఎలక్ట్రిక్ ఇంజిన్ కలిగిన విమానాలను రంగంలోకి దించనున్నాయి ఎయిర్లైన్ సంస్థలు. ప్యారిస్లో జరిగిన ఎయిర్ షోలో ఈ విమానం నమూనా ఎలైస్ను ప్రదర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 'కమర్షియల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ విమానం' నమూనా ఇదే కావటం విశేషం.
ఇజ్రాయెల్కు చెందిన 'ఏవియేషన్' అనే సంస్థ ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని తయారుచేసింది. ఈ మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లో 9 మంది ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 10వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదని సంస్థ వివరించింది. గంటకు 440కి.మీ. వేగంతో 1,040 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వివరించింది. 2022 సంవత్సరానికి ఈ విమానం సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఏవియేషన్ సంస్థ ఆశిస్తోంది.
సాధారణ విమానాల కంటే ఇది కాస్త భిన్నంగా కనిపిస్తుంది. విమానం ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ప్రొపెల్లర్స్ ఇందులో మూడు ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెండు, చెరో రెక్కకు అమరి, విమానం ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. అమెరికాకు చెందిన 'కేప్ ఎయిర్' అనే సంస్థ కొన్ని విమానాలను కొనేందుకు ఏవియేషన్తో ఒప్పందం చేసుకొవడం మరో విశేషం.