నీటిని స్టవ్ మీదనో.. పొయ్యి మీద పెట్టో.. లేదంటే గీజర్లోనో వేడి చేస్తాం. కానీ అక్కడ నీటిని ఎలా వేడి చేస్తారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. అక్కడ నీటిని వేడిచేయడానికి స్టవ్, కరెంట్ అవసరం లేదు. ఇవేమి లేకుండానే నీటిని వేడిచేస్తారు. ఇంతకీ ఎలా అంటే.. నీరు వేడిచేయడానకి వేడి కావాలి కాబట్టి.. అక్కడ మనుషుల కదలికల నుంచి వచ్చే ఉష్ణమే నీటిని వేడి చేసేస్తోంది. చదవటానికి వింతగా ఉన్న ఇది నిజం.
స్వీడన్ రాజధాని స్టాక్హోం లో 'స్టాక్హోం సెంట్రల్ స్టేషన్' ఉంది. అక్కడే ఈ విచిత్రం జరుగుతోంది. అక్కడ ఉండే రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. రోజుకు రెండున్నర లక్షల మందికి పైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అలా మనుషులు కదలికల వల్ల అక్కడ ఉష్ణం పుడుతుంది. అక్కడే కాదు ఎక్కడైనా రద్దీగా ఉన్నగా ఉన్న ప్రాంతంలో కొంత వేడి పుడుతుంది. అందుకే మనుషులు ఎక్కువగా ఉన్న చోట ఉక్కబోతగా పీలవుతారు చాలమంది.
మనుషుల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని మామూలుగా ఎగ్జాస్ట్లను ఉపయోగించి బయటకు పంపించేస్తారు. కానీ ఆ రైల్వే స్టేషన్లో మాత్రం వెంటిలేషన్ విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ వేడిని అది లాక్కుని ఆ భవనం కిందున్న ట్యాంకుల్లోని నీటిపైకి మళ్లిస్తుంది. దీంతో ఆ నీరు క్రమంగా వేడెక్కుతుంది. అలా వచ్చిన వేడి నీళ్లే ఆ పక్కన ఉన్న పదమూడు అంతస్తుల భవనమంతా సరఫరా చేస్తారు. ఇంత కష్టం ఎందుకంటే స్వీడన్లో విద్యుత్ ఛార్జీలు అధికం. పైగా అక్కడ శీతకాలం విపరీతమైన చలి ఉంటుంది. దీంతో అంతా వేడి నీటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఇక్కడ ఈ విధానం బాగా ఉపయోగపడుతోంది.