లేచిన దగ్గర నుండి.. రాత్రి పడుకునే వరకు కొందరి చెవిలో హెడ్ఫోన్స్ ఉండాల్సిందే. ప్రస్తుతం కొంతమంది యూత్కి హెడ్ఫోన్స్ శరీరంలో ఒక పార్ట్గా మారింది. మ్యూజిక్ని ఆస్వాదించడానికి.. గంటల తరబడి ఫోన్ మాట్లాడడానికి లేదా సినిమా చూడడానికి.. కారణం ఏదైనా.. యువత చెవిలో హెడ్ఫోన్స్ని దర్శనమిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి ఓ షాకింగ్ వార్త వినిపిస్తోంది. రోజులో నాలుగు నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్ వినియోగిస్తే ప్రమాదమని హెచ్చరిస్తోంది. నాలుగు నిమిషాలకు మించి హెడ్ఫోన్స్ వాడితే వినికిడి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది.
ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు హెడ్ఫోన్స్ ఉపయోగించే వారిలో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పెద్దపెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయని.. అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేమంటున్నారు నిపుణులు. అలాంటి సమస్యలకు గురైతే.. వినికిడి పరికరాలు వాడడం తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. వయసు పెరగడం వలన తలెత్తే వినికిడి సమస్యల కంటే.. పెద్ద శబ్దాలు వినడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయట. వినికిడి సమస్యలబారిన పడేవారిలో ఎక్కువగా యువతే ఉన్నట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించడం విశేషం.