లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయం తీసుకుంది. 520 మందిని లేదంటే 13% మంది ఉద్యోగులను తొలగించాలని.. అలాగే మిగిలిన వారి జీతాలను తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు శుక్రవారం ఉద్యోగులకు రాసిన అంతర్గత ఇమెయిల్లో తెలిపారు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో.. ఆ ఎఫెక్ట్ తన వ్యాపారాలపై బలంగా ప్రభావం చూపింది. ''లాక్ డౌన్ కారణంగా మన వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.
చాలా రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయి. వచ్చే 6-12 నెలల మధ్యకాలంలో మరో 25-40 శాతం రెస్టారెంట్లు మూత తప్పదు'' అని ఉద్యోగులకు పంపిన నోట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ఆన్ లైన్ ఫుడ్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిందని, తప్పని పరిస్థితుల్లో కిరాణా సరుకులు డెలివరీ చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులందరినీ భరించే శక్తి సంస్థకు లేనందువలనే అందరికి పని కల్పించలేకపోతున్నట్టు జొమాటో స్పష్టం చేసింది.