వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా పూర్తి మద్దతు ప్రకటిస్తునట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏపీ అండ్ తెలంగాణా) కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో పేరం శివ నాగేశ్వర రావు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అన్నవ్యక్తి టీడీపీ అధినేత నారా చంద్రబాబన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డియే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి ఒకే మాట మీద నిలబడ్డారని కొనియాడారు. అసలు పోలవరం, రాజధానికి కేంద్ర సర్కార్ నిధులు కేటాయిస్తే నారా చంద్రబాబు వాటికి లెక్కచూపటం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముద్దాయిగా చూపడానికి వీరేమైనా న్యాయమూర్తులా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్కు కేసీఆర్ మద్ధతు ఇస్తే చంద్రబాబు నాయుడికి ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కేజ్రీవాల్, మమతా బెనర్జీల మద్ధతు తీసుకోలేదా అని అడిగారు.