4 నెలల తర్వాత మౌనం వీడనున్న వంగవీటి రాధా
వంగవీటి రాధా నాలుగు నెలల మౌనం వీడనున్నారు. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాదా వైసీపీ ఎందుకు వీడాల్సివచ్చిందో క్లారిటీ ఇవ్వనున్నారు.
వంగవీటి రాధా నాలుగు నెలల మౌనం వీడనున్నారు. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాదా వైసీపీ ఎందుకు వీడాల్సివచ్చిందో క్లారిటీ ఇవ్వనున్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ గత కొంత కాలంగా రాధా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, టీడీపీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించనున్న రాధా వైసీపీపై ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్సైంది. శుక్రవారం చంద్రబాబును కలవనున్న రాధా లాంఛనంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈనెల 25న సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్లో చంద్రబాబును కలవనున్న వంగవీటి రాధా తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరడం ఖాయమవడంతో తెలుగుదేశం నేతలు, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఆయనతో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టీడీ జనార్దన్లు తెలుగుదేశం పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించారు. సుమారు 20 నిమిషాలు రాధాతో బేటి అయ్యారు. రాధాను తమ పార్టీలోకి చేరమనటానికి వచ్చామని, చంద్రబాబు సందేశం చెప్పామన్నారు టీడీపీ నేతలు. దీనిపై రాధా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అయితే రాదా టీడీపీలో చేరేందుకు ఈ సమావేశంలో అంగీకరించినట్లు తెలుస్తోంది. రాధా టీడీపీలో చేరికపై అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 25న టీడీపీలోనే చేరతానరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగునంగానే రాధా సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక టీడీపీలో చేరే విషయం పక్కన బెడితే, వైసీపీని వీడటానికి ఉన్న కారణాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాధా భావిస్తున్నారు. వైసీపీలో జరిగిన అవమానాల గురించి స్పష్టంగా అభిమానులకు తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నారు. రంగాకి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించటంపై కూడా వైసీపీలో ఆంక్షలు ఉన్నాయనేది రాధా ఆవేదనగా తెలుస్తోంది. సెంట్రల్ సీటు ఇస్తామని చెప్పి, నాలుగేళ్లు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పలు సాకులు చెప్పి, తనను తప్పించి అవమానించారని రాధా వాపోతున్నారు. తనను పార్టీలో నుంచి పోమ్మనకుండానే, పార్టీని వీడేలాగా అధిష్టానం వ్యవహరించింది అనేది రాధా ఆవేదన. టీడీపీలో చేరక ముందే, తనపై సోషల్ మీడియా వేదికగా వైసీపీనే విష ప్రచారం చేయిస్తోందనేది రాధా సన్నిహితుల వాదన. టీడీపీలో చేరిక విషయం ఎలా ఉన్నా అసలు వైసీపీలో అంతర్గతంగా జరిగిన అవమానాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఆలోచనలో రాధా ఉన్నారు. ఇందుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మెత్తానికి చాలా కాలం మౌనం తరువాత, రాధా నోరు విప్పబోతున్నారు. అయితే మీడియా సమావేశంలో రాధా జగన్ పై తీవ్ర స్థాయిలో విరుకుపడతారా..? లేక, వైసీపీని వీడడానికి గల కారణాలను చెప్పి ముగించేస్తారా అనేదానిపై ఇరు పార్టీలతో పాటు రాధా అభిమానుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.