మీకు జన్ధన్ బ్యాంకు ఖాతా ఉందా..? అయితే మీ బ్యాంకు ఎకౌంట్లో హఠాత్తుగా డబ్బు జమ కావచ్చు. ఎన్నికల వేళ మిమ్మల్ని ఆకర్షించడానికి అభ్యర్థులు ఎవరైనా మీ జన్ధన్ ఖతాలో డబ్బు డిపాజిట్ చేయవచ్చు. ఉత్తర ప్రదేశ్లో ఇదే జరిగింది.
ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో జన్ధన్ ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొరాదాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో గత కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యింది. ఒక్కో ఖాతాలో 10 వేల రూపాయల చొప్పున మొత్తం కోటీ 70 లక్షల రూపాయలు డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభాలకు గురుచేయడానికి రాజకీయ నాయకులు ఎవరైనా జన్ధన్ ఖతాల్లో డబ్బు జమ చేశారా? లేదంటే ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందిన వారికి బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడు నగదు జమైందా అనే అంశాలను ఈసీ పరిశీలిస్తోంది. అనుమానాస్పద డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
అంతేకాదు ఈ ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 1470 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.