హైదరాబాద్లో మెట్రో రైలు మరో మెట్టు ముందుకేసింది. హైటెక్ సిటీకి మెట్రోరైలు పరుగులు పెడుతోంది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పచ్చ జెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమీర్పేట- హైటెక్సిటీ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు ఒక రైలు రాకపోకలు సాగించనుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉండగా ప్రస్తుతం ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ మార్గం ద్వారా హైటెక్ సిటీ పరిసరాల్లో పని చేసే ఐటీ ఉద్యోగులకు ప్రయాణ భారం తగ్గనుంది.