తెలంగాణలో వరస కౌంటింగ్ లు ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ సత్తా చూపగా ఇప్పుడు ప్రాదేశి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 సెంటర్లలో మంగళవారం కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ప్రాదేశిక నియోజకవర్గాల టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్దమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మొత్తం 536 స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్లను నిర్ధేశించిన లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లను లెక్కించనున్నారు. పరిషత్ కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం లో 3 విడతల్లో మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా దీనిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడం తో.. 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల్లో 1 కోటి 20లక్షల 86 వేల 385 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కౌంటింగ్ లో ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 978 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేయగా 11,882 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో కలుపుకుని మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం నుంచే ఫలితాల తెలిసే అవకాశం ఉంది. ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.