ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ ప్రచారంలోనూ ముందుంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబే టార్గెట్ గా విసుర్లు విసిరారు.
తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికి అమరావతికి పారిపోయాడని అన్నారు. కేసీఆర్ను అణు క్షణం తలచుకోనిదే బాబుకు నిద్ర పట్టదని, బాబు ప్రసంగాలు జనాలకు బోర్ కొడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చంద్రబాబు మొండిచేయి చూపారని ఆరోపించారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారన్నారు తలసాని. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తెలుసని అన్నారు. ఏపీలో వైసీపీదే విజయం అని చెప్పారు. వైసీపీ 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ జోష్యం చెప్పారు.టీడీపీ అరాచక పాలనపై ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే మార్పురావాలని కోరుకుంటున్నారన్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.