పక్కాగా స్కెచ్‌ వేసి ఇళ్లను లూఠీ చేసి మరీ సంపాధించాడు

Update: 2019-01-29 05:47 GMT

అతని కన్ను పడిందా..? ఆ ఇళ్లు ఖాళీ అవ్వాల్సిందే...రాత్రిళ్లు దోచేయడం.. పగటిపూట బేరం పెట్టడంలో బిజీగా ఉంటాడు. ముమ్మతిప్పలు పెడుతున్న కరుడు కట్టిన అంతర్ రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకి ఎవరా దొంగ..ఎంత దోచుకున్నాడో చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు..

మువ్వల హారాలు, చంద్రహారాలు, నల్లపూస దండలు, పుస్తెల తాళ్లు, బంగారు, వెండి ఆభరాణాలు ఇలా ఇవన్నీ ఒక్కడి కష్టార్జితమే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నటరాజు ఒంటి చేత్తో సంపాధించిన సొత్తు ఇది. కాయకష్టం చేసి సంపాదించినవని భావిస్తే. పప్పులో కాలేసినట్టే చేతివాటంతో కూడబెట్టినవి. పక్కాగా స్కెచ్‌ వేసి ఇళ్లను లూఠీ చేసి మరీ సంపాధించాడు. వరుస దొంగతనాలతో ఎన్నో రోజులుగా పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు చేసిన నటరాజు పాపం పండింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కటకటాల పాలై ఊచలు లెక్కబెడుతున్నాడు.

పశ్చిమగోదావరి ప్రాంతానికి చెందిన వేముల నటరాజ్ వృత్తిపరంగా ఆయుర్వేదిక్ బిజినెస్ చేసేవాడు. ఇదే సమయంలో మెదక్ తూఫ్రాన్ కు చెందిన నగల వ్యాపారితో స్నేహం కుదిరింది. ఇద్దరికీ ఈజీ మనీ అంటేనే ఆసక్తి. అందుకే దొంగతనాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 2016 నుండి రాత్రి సమయంలో వరుస దొంగ తనాలు మొదలుపెట్టాడు. నటరాజ్ దొంగతనం విన్యాసాలు అన్ని ఇన్నీ కావు నాలుగు పీఎస్‌ల పరిధిలో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. నేరేడ్‌మెట్, జవహార్ నగర్, కీసర, కుషాయిగూడా ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు.

దొంగతనం చేసిన సొత్తుని అమ్మడానికి నటరాజు తనకంటూ ఒక టీంను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా దోచుకొచ్చిన బంగారాన్ని సొమ్ము చేసుకున్నాడు. నటరాజ్ దొంగతనాల బిజినెస్ రెండు పూలు ఆరు కాయలుగా మారింది. ప్రత్యేకించి పండగల సమయంలో ఎక్కువ దొంగతనాలు చేసేవాడు. ఇప్పటికే ఇతనిపై రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 47 కేసులు నమోదు అయ్యాయి. నటరాజుతోపాటు దొంగతనం చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులను, అతని సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నటరాజు నుండి రెండు కిలోల బంగారం, ఏడున్నర కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఆభరణాలు త్వరలోనే బాధితులకు అందిస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ చెప్పారు.  

Similar News