హైదరాబాద్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఎయిర్ పోర్ట్కు చేరవేసే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే వన్ వేగా మారింది. రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నివారించేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలను ఆరాంఘర్ నుంచి శివరాంపల్లి పీడీపీ ఎక్స్ రోడ్ రేతిబౌలి, అత్తాపూర్ మీదుగా మెహదీపట్నం వైపు మళ్లిస్తున్నారు. ప్రస్తుతానికి మెహదీపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు.
11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర తీవ్రంగా దెబ్బతినడంతో ఎప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కనీస వేగంతో వెళ్లినా కూడా రోడ్డు బాగా లేక జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గత 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు నేటికి చేయకపోవడం వల్ల ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్తో కొత్త బీటీ రోడ్డు రేపటి నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు.