విమానయాన చరిత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో పిడుగు పడటంతో విమానం వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా విమానం ముందుభాగానికి వ్యాపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణీకులు ముందు భాగంలో తెరుచుకున్న అత్యవసర ద్వారం గుండా బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.
అయితే తొలుత విమానం ల్యాండ్ అయ్యే సమయంలో నేలను బలంగా తాకడంతో మంటలు అంటుకున్నాయని వార్తలు వచ్చాయి. తర్వాత విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో వెనుకభాగంలో పిడుగు పడటంతో మంటలు వ్యాపించాయని తేల్చారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రాజధాని మాస్కోలోని షెరెమెత్యేవో విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకున్న సుఖోయి సూపర్జెట్ విమానంలో కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి రప్పించారు.
ఈ క్రమంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. మంటలతోనే విమానం రన్ వే పై పరుగులు పెట్టింది. ఇటు హుటాహుటిన విమానంలోని అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఎమర్జెన్సీ ద్వారం గుండా 37 మంది ప్రయాణీకులు బయటపడి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.