నేడు జనసేన శంఖారావం.. గుంటూరులో భారీ బహిరంగ సభ

ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత జనసేనాని గుంటూరుపై ఫోకస్‌ చేశారు. ఇవాళ గుంటూరు నుంచి శంఖారావం పూరించబోతున్నారు. జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొనడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2019-01-27 04:59 GMT

ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత జనసేనాని గుంటూరుపై ఫోకస్‌ చేశారు. ఇవాళ గుంటూరు నుంచి శంఖారావం పూరించబోతున్నారు. జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొనడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అధినేతగా తొలిసారిగా గుంటూరు పర్యటనకు వస్తున్న పవన్‌కు ఫ్యాన్స్‌, కార్యకర్తలు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు సిద్ధమయ్యారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. వామపక్షాల పొత్తుతో 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌ గుంటూరుకు వస్తున్నారు. చాలాకాలం తర్వాత గుంటూరుకు పర్యటనకు వస్తున్న పవన్‌ తొలుత ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో నూతనంగా నిర్మించిన జనసేన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అభిమానుల మధ్య ర్యాలీతో సభా ప్రాంగణానికి బయల్దేరుతారు.

లాడ్జ్‌ సెంటర్‌లో ఉన్న ఎల్‌ఈఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన శంఖారావం సభకు పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ తీరును ఎండగడుతూ సాగుతున్న పవన్‌ కల్యాణ్‌ ఈ సభలో ఎలాంటి అంశాలపై మాటల తూటాలు పేల్చుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటు సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పవన్‌ కోసం భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళలు, పురుషులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను జనసేన నాయకులు పరిశీలించారు. సభ విజయవంతం కోసం వెయ్యి మంది వాలెంటీర్లు సేవలు అందిస్తారని జనసేన నాయకుడు రావెల కిశోర్‌బాబు తెలిపారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు ఫ్యాన్స్‌ సమాయత్తమయ్యారు. తమ అభిమాన హీరోకు వెల్‌కమ్‌ చెబుతూ భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేశారు. 

Similar News