తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే పోలింగ్ను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించిన నేపధ్యంలో ఆయా పార్టీలకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటింగ్కు హాజరవుతారా ? లేదా ? అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఇదే సమయంలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ ఓటింగ్లో పాల్గొంటారా ? లేదా ? పాల్గొంటే ఎవరికి ఓటు వేస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఓటింగ్కు దూరంగా ఉండాలంటూ కాంగ్రెస్, టీడీపీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. శాసనసభలో ప్రస్తుత బలాబలాల ప్రకారం టీఆర్ఎస్కు స్వంతంగా 90 మంది సభ్యులున్నారు. వీరితో పాటు మిత్రపక్షం ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నలుగురు, టీడీపీ నుంచి మరొకరు టీఆర్ఎస్కు మద్ధతిస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం టీఆర్ఎస్కు 102 మంది సభ్యుల బలం ఉంది. దీంతో తొలి ప్రాధాన్యత ఓటుతోనే ఐదుగురు అభ్యర్ధులను గెలిపించుకునేలా టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. ఈ మేరకు నిన్నే మాక్ పోలింగ్ నిర్వహించి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించింది. ఇదే సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఓటింగ్ను బాయ్కాట్ చేయడంతో టీఆర్ఎస్, ఎంఐఎంల గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది.