దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలతోపాటు పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
మాక్ పోలింగ్లోనే మొరాయించిన ఈవీఎంలు
ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పని చేయని ఈవీఎంలు, వీవీ ప్యాట్లు
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఓటు వేసేందుకు జనం తరలిరావాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా, ఆ పోలింగ్ కేంద్రంలోనే ఈవీఎంలు పనిచేయలేదు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటేశారు. రాజమండ్రిలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కడప పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మలమడుగులో ఆయన ఓటేశారు.
ఓటింగ్ కంపార్ట్మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు.
సినీ హీరో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఓటు వేసేందుకు అందరూ తరలిరావాలని అల్లు అర్జున్ కోరారు.
పులివెందులలో వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి ఆశీస్సులు తమపై ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్టు చెప్పారు. నిర్భయంగా ఓటు వేయాలని కొత్త ఓటర్లకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
ఉండవల్లిలో సీఎం చంద్రబాబునాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనాలన్నారు.
సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భరత్ నగర్ లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఓటు వేసేందుకు అందరూ తరలిరావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తార్నాక కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఓటు హక్కు వినియోగించకుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఈవీ రెడ్డి కాలేజీలోని పోలింగ్ బూత్ లో ఆయన తన సతీమణి పద్మావతితో కలిసి ఓటేశారు.
గుంటూరు జిల్లా నరసరావు పేట మండలం ఎల్లమంద గ్రామంలో టెన్షన్ నెలకొంది. వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది.
నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి రోజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రోజా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులు చేయకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల డివిజన్ లోని కొన్ని పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. ఇందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సెంటర్లలో వెలుతురు సరిగా లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం పోతంగల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, తన భర్తతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందన్నారు. కావునా పట్టణ ఓటర్లు తప్పకుండా ఓటేయాలని కోరుతున్నట్లు ఆమె చెప్పారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట పరిధిలోని ఉప్పలపాడులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అరవిందబాబుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సాయినగర్ కాలనీవాసులు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ కాలనీలో అభివృద్ధి పనులు చేయకపోవడంతో ఓటు వేయకుండా నిరసన తెలిపారు. తమ కాలనీని అభివృద్ధి చేస్తేనే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండలం అయ్యోరపల్లి గ్రామస్థులు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామాన్ని వేములవాడ మున్సిపాలిటీలో కలపడంపై నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాభివృద్ధికి నాయకులు హామీ ఇచ్చి విస్మరించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లితాండలో ఓటింగ్ ను బహిష్కరించారు. తమ తాండలో తాగునీటి సమస్య తీర్చనందుకు ఓటు వేసేందుకు నిరాకరించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన తండావాసులు..తాగునీటి సమస్య తీర్చినప్పుడే ఓటు వేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సతీమణి పుష్పతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం ప్రాధమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు పవిత్రమైనది ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.