నిజామాబాద్ జిల్లా మక్లూరులో చిరుత సంచారం
అడవుల్లో ఉండాల్సిన మృగాలు గ్రామాల బాటపడుతున్నాయి. జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మక్లూరులో సంచరిస్తోన్న చిరుత జనాన్ని హడలెత్తిస్తోంది. పొలాల్లోకి వచ్చి తిరుగుతోన్న చిరుతను చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
అడవుల్లో ఉండాల్సిన మృగాలు గ్రామాల బాటపడుతున్నాయి. జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మక్లూరులో సంచరిస్తోన్న చిరుత జనాన్ని హడలెత్తిస్తోంది. పొలాల్లోకి వచ్చి తిరుగుతోన్న చిరుతను చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. చిరుత భయంతో మక్లూరు, మామిడిపల్లి, రామచంద్రయన్పల్లి గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం గుత్ప శివార్లలో పాలం చుట్టూ వేసిన ఇనుప కంచెలో ఇరుక్కున్న చిరుత విలవిల్లాడింది. చిరుత కాలు కంచెలో ఇరుక్కోవడంతో పంట చేను వైపు వచ్చిన రైతు ఆ సీన్ను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకు, ఫారెస్ట్ అధికారులకు సమచారం ఇచ్చాడు. దాంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు భారీ వలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్ను రప్పించి చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే ఇనుప కంచె నుంచి చాకచక్యంగా బయటపడ్డ చిరుత తప్పించుకుని పారిపోయింది.
చిరుత చుట్టూ వల ఏర్పాటుచేసి, మత్తు ఇంజక్షన్ ఇచ్చేలోపే తప్పించుకుని పారిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత అడవిలోకి వెళ్లిపోయిందా? లేక గ్రామ పరిసరాల్లోనే దాక్కుందా అన్న భయంతో వణికిపోతున్నారు. చిరుత భయంతో రైతులు పొలాల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తోందో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. అయితే తప్పించుకున్న చిరుత పశువులు, మేకలపై దాడిచేసే అవకాశం ఉన్నందున రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.