విద్యార్ధులు, తల్లిదండ్రుల ఆందోళనలతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయంటూ చెలరేగుతోన్న ఆరోపణలపై నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అనుమానాల నివృత్తికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ ఒక్క విద్యార్ధికీ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధులు, తల్లిదండ్రుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ నియమించింది. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధికారుల అంతర్గత తగాదాలతోనే ఈ అపోహలు సృష్టించారని అన్నారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఫలితాలపై ఎవరికైనా అనుమానాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయంటూ చెలరేగుతోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ ఏ ఒక్క విద్యార్ధికీ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక ఇంటర్ ఫలితాలపై టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు హైదరాబాద్ బిట్స్ పిలానీ ప్రొఫెసర్ వాసన్ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ నిశాంత్లతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.