జ‌న‌సేన బ‌హిరంగ స‌భలో వైసీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల వాగ్వా‌దం : హైప‌ర్ ఆది కారు అద్దా‌లు ధ్వంసం

Update: 2019-01-21 04:11 GMT

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో ఆదివారం జరిగిన జనసేన సభ రసాభాసగా మారింది. వైసీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలమధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు హైపర్ ఆది కార్ అద్దాలను ధ్వంసం చేయ‌డంతో స‌భ నుంచి హైప‌ర్ ఆది వెళ్లి‌పోయారు. ఈ సభకు హాజరైన కొందరు స్థానిక నేతల కథనం ప్రకారం, వైసీపీ అధినేత జగన్‌ పై విమర్శలు చేయడంతో గొడవ ప్రారంభమైంది. వారిని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు 'జై జగన్‌' అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో హైపర్ ఆది, తన కారులో రావడంతో కారుపై దాడికి యత్నించారు.

జనసేన కార్యకర్తల సాయంతో వేదికపైకి వెళ్లిన ఆయన, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, జనసేన కార్యకర్తలపై దాడులతో గందరగోళం సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పవన్‌ కల్యాణ్ వంటి నిస్వార్థ నేతను ప్రజలు ఎన్నుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆయన కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. హైపర్ ఆది ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ కార్యకర్తలు అడ్డుతగలడంతో, ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించగా, విషయం తెలుసుకుని వచ్చిన పోలీసులు ఆదిని మరో మార్గం గుండా తిరుపతి రహదారిపైకి చేర్చారు.

Similar News