తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తప్పులు మీద తప్పులు చేస్తూ విద్యార్ధులతో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలతో ఎంతో మంది విద్యార్ధుల బలవన్మరణాలకు కారణమైన ఇంటర్ బోర్డు రీవెరికేషన్లోనూ అంతే అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇంటర్ అధికారుల తప్పిదంతో ఆత్మహత్య చేసుకున్న అనామిక మార్కులపై మరోసారి గందరగోళానికి తెరలేపింది.
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, అక్రమాలు, తీవ్ర గందరగోళంతో సుమారు పాతిక మంది విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రీవెరిఫికేషన్లోనూ మళ్లీ అదే అయోమయమే కనిపింపింది. ఇంటర్లో ఫెయిలైనందుకు బాధతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని అనామిక మార్కులపై మరోసారి గందరగోళం చెలరేగింది. తెలుగు పేపర్ రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణురాలైందని వెబ్సైట్లో వెల్లడించిన ఇంటర్ బోర్డు కొద్దిసేపటికే అనామిక ఫెయిలైందంటూ మాట మార్చింది.
అనామికకు తెలుగులో 20 మార్కులే రావడంతో ఇంటర్లో ఫెయిలైంది. దాంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. అయితే రీవెరిఫికేషన్లో 48 మార్కులతో అనామిక పాసైనట్లుగా ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రకటించింది. దాంతో అనామిక తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. అది కాస్తా వివాదంగా మారడంతో ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది. వెబ్సైట్లో 48 మార్కులు వచ్చినట్లు అప్డేట్ చేసిన ఇంటర్ బోర్డు అంతలోనే మాట మార్చింది. మరోసారి తప్పులు దొర్లాయంటూ అత్యంత నిర్లక్ష్యంగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. రీవెరిఫికేషన్లో అనామికకు కేవలం 21 మార్కులే వచ్చాయని, కానీ పొరపాటున 48 మార్కులుగా అప్డేట్ అయ్యిందంటూ చెప్పుకొచ్చింది. క్లరికల్ సిబ్బంది తప్పిదంతో ఈ గందరగోళం తలెత్తిందంటూ అనామిక ఆన్షన్ సీట్ను సైతం బయటపెట్టారు.
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై అనామిక తల్లిదండ్రులతోపాటు బాలల హక్కుల సంఘం మండిపడుతోంది. అనామిక మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనామిక ఆత్మహత్యకు కారణమైన ఇంటర్ బోర్డు అధికారులపై క్రిమినల్ కేసు పెడతానని ఆమె సోదరి ఉదయ అంటోంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి బయటపడిందన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అనామిక మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతులేని నిర్లక్ష్యంతో ఎంతోమంది విద్యార్ధుల బలవన్మరణాలకు కారణమైన ఇంటర్ బోర్డు మరోసారి తన చేతగానితనాన్ని బయటపెట్టుకుంది. పదేపదే తప్పిదాలు చేస్తూ, విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.