తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్లే విద్యార్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్ బోర్డు ముందు ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.ఈ నేపథ్యంలో నేడు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ స్పందించారు. అయితే పరీక్ష పేపర్లు గల్లంతైన మాట పూర్తి అవాస్తవమని, కేవలం ఎగ్జామినర్ పొరపాటు వల్లే ఈ సమస్య వచ్చిందని తెలిపారు. కాగా పరీక్షలపై రీ వాల్యుయేషన్కు అప్లై చేసుకోవచ్చని, రీ వాల్యుయేషన్ తేదీల గడువుపై ఆలోచిస్తామన్నారు. అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని స్పష్టం చేశారు.
ఇక మంచిర్యాల జిల్లాలో ఓ టాప్ ర్యాంకర్, జన్నారం మండలం చింతగూడే గ్రామానికి చెందిన మండలం కేంద్రంలోని కరిమల జూనియర్ కళశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్న నవ్య అనే అమ్మాయి సున్నా మార్కులు వచ్చిన విషయం తెలిసిందే కాగా ఈ అంశంపై స్పందించారు అశోక్కుమార్. నవ్య అనే విద్యార్థిని విషయంలో పెద్ద తప్పిదమే జరిగిందని ఆమెకు 99 మార్కులు వస్తే 0 మార్కులు వచ్చినట్టు వేశారని అశోక్ చెప్పారు. ఓఎంఆర్ షీట్లో మార్కుల స్థానంలో బబ్లింగ్ చేయడంలో పొరపాటే అందుకు కారణమని వివరించారు.కాగా నవ్యకు 99 మార్కులకు బదులు ఆ ఎగ్జామినర్ జీరో బబ్లింగ్ చేశాడని, ఓఎమ్మార్ షీట్లో 9,9 అంకెల కిందనే సున్నా, సున్నా అంకెలు కూడా ఉంటాయని, 9-9 అంకెలను బబ్లింగ్ చేయడానికి బదులు పొరపాటున 0,0ను బబ్లింగ్ చేశారని, స్కూటినైజర్ కూడా సరిగ్గా పరిశీలించకుండా సున్నా, సున్నానే బబ్లింగ్ చేయడంతో విద్యార్థిని నవ్యకు అలా సున్నా మార్కులు వచ్చాయని అశోక్కుమార్ తెలిపారు. బాధ్యులైన వారికి ఛార్జిమెమోలు జారీ చేసి వివరణ కోరామని, వారికి పెనాల్టీ వేస్తామని చెప్పారు.