21 నిముషాలు మెరుపుదాడులకు మనదేశ సైన్యం తీసుకున్న సమయం. ఆ కొద్ది సమయంలోనే పీఓకేలో బాంబుల వర్షం కురిపించారు. దట్టమైన చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోయిన ఫైటర్ జెట్లు శత్రుస్థావరాలను నేలకూల్చాయి. టెర్రరిస్టులకు సరైన బుద్ది చెప్పాయి. మరి వాయుసేన ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేసింది..? ఏ ఏ సమయాల్లో దాడి చేసింది..? శత్రువులు పసిగట్టకుండా పని ఎలా ముగించింది..?
సర్జికల్ స్ట్రైక్స్ రెండున్నరేళ్ల క్రితం పరిచయం అయిన ఈ సాహసం పుల్వామా ఘటన తర్వాత మన వాయుసేన మరోసారి అదే మంత్రాన్ని ప్రయోగించింది. అమరవీరులకు నివాళిగా మెరుపుదాడులతో పీఓకేను వణికించింది. అర్ధరాత్రి చీకట్లను చీల్చుకుంటూ శత్రువులపై దాడి చేసింది. ఉగ్రశిబిరాలను నేలకూల్చింది. దేశం గర్వించదగ్గ విజయాన్ని మన వాయుసేన అందించింది. సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని సిద్ధమైన వాయుసేన అత్యంత పకడ్బందీగా ప్రణాళికలు రచించింది. ఇందుకు అత్యాధునిక మిరాజ్ 2000 ఫైటర్ జెట్లను ప్రయోగించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి వందకు వంద శాతం.. విజయాన్ని సొంతం చేసుకుంది.
కేవలం 21 నిముషాల్లోనే మూడు దాడులతో లక్ష్యాన్ని ఛేదించింది మన వాయుసేన. మొదటగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలా 45 నిముషాలకు దాడుల కోసం మొదటి మిరాజ్ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. పీఓకే రాజధాని అయిన ముజఫరాబాద్కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్పై గురి పెట్టింది. 3 గంటలా 45 నిముషాల నుంచి 3 గంటల 53 నిముషాల వరకు బాలాకోట్లో బాంబుల వర్షం కురిపించారు.
పీఓకే రాజధాని అయిన ముజఫరాబాద్పై రెండో అటాక్ జరిగింది. సరిగ్గా 3 గంటలా 48 నిముషాల నుంచి 3 గంటలా 55 నిముషాల వరకు.. బాంబుల వర్షం కురిపించాయి. మూడోదాడి 3 గంటలా 58 నిముషాల నుంచి 4 గంటలా 4 నిముషాల మధ్య జరిగింది. ఈ సారి చకోటా ప్రాంతంలో మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు వెయ్యి కిలోల బాంబులతో నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేశాయి. జైషే మహమ్మద్, లష్కరే, హుజ్బుల్ ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే శత్రువులు అప్రమత్తమయ్యే లోపే మన ఐఏఎఫ్ దళాలు పని ముగించాయి.