మరికొద్ది గంటల్లో భారత్లో తొలి దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్న సమయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో బీజేపీ గెలిస్తేనే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ముందుకు సాగుతాయని అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారత్ లో అధికారంలోకి వస్తే ధైర్యంతో శాంతి చర్చలు సాగించలేరని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ విదేశీ మీడియాతో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. తనకు భారత్లోని చాలా మంది ముస్లింలు తెలుసని, వారి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ ప్రస్తుతం వారు హిందుత్వ జాతీయవాదంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు.
నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ను తలపిస్తున్నారని, ఆయన తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఓ రాజకీయ అంశమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారని, తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్కు అవసరమన్నారు. ఇప్పటికే పాక్ లోని చాలామంది ఉగ్రవాదులను ఆర్మీ ఏరివేసిందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తనకు వ్యతిరేకత పెరిగితే సైన్యం చేత మోదీ పాక్ పై దాడి చేయించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.