ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఛీప్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ అనిల్ చంద్ర పునేఠా జీవో నెంబర్ 750ని జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఆఫీస్లో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని వెంటనే డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావును సూచించారు.