సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో అంకానికి సర్వం సిద్ధమైంది. ఈ దఫాలో 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 9 రాష్ట్రాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ ఎన్నికలతో ఒడిశాలో సార్వత్రిక సమరం పూర్తి కానుంది.ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక సమరంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 9 రాష్ట్రాల పరిధిలో మొత్తం 71 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ దఫాలో కూడా పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. మహారాష్ట్రలో 17 నియోజకవర్గాలకు, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లో 13, పశ్చిమ బంగలో 8, మధ్యప్రదేశ్, ఒడిశాలో 6, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూకాశ్మీర్లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది.
ఈ దశలోనే దక్షిణ ముంబై నియోజకవర్గంలో మిలింద్ దేవ్రా బరిలో ఉన్నారు. ఇతనికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మద్దతుంది. దీంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. అలాగే ముంబై నార్త్ నుంచి ఒకప్పటి హీరోయిన్ ఉర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఇటు రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ పోటీ చేస్తున్నారు. అలాగే యూపీలోని ఉన్నావ్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ సాక్షీ మహారాజ్ పోటీలో ఉన్నారు.
ఇక ఈ సారి పశ్చిమబంగాలో ఎలాగైనా ప్రభావం చూపించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా ప్రచారాన్ని నిర్వహించింది. అసన్సోల్ నుంచి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి సినీనటి మూన్మూన్ సేన్ బరిలో ఉండటంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. బీహార్లోని బేగూసరాయి నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ సీపీఐ నుంచి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు. ఆయనకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి మాజీ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రధాన పోటీదారుగా నిలబడ్డారు. అలాగే మధ్యప్రదేశ్లోని ఛింద్వారా నియోజకవర్గంలో సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ బరిలో ఉన్నారు. మరోవైపు సోమవారంతో ఒడిశాలో అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికలు పూర్తికానున్నాయి. 6 లోక్సభ స్థానాలకు తోడుగా 42 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.