మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారా..? వైఎస్. జగన్తో గంటా శ్రీనివాసరావు భేటీ అయినట్లు వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై చంద్రబాబు సాక్షిగా గంటా ఏమన్నారు..?
పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. వంగవీటి రాధా టీడీపీలో చేరిన సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తాను జగన్తో భేటీ అయినట్లు వైసీపీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తూ మైండ్ గేమ్ అడుతున్నాయని గంటా అన్నారు. పార్టీ మారే పరిస్థితే వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని తేల్చి చెప్పారు.
గంటా వైసీపీలో చేరుతున్నారంటూ అసత్యాలను ప్రసారం చేసి ప్రజలను కన్ప్యూజ్ చేయొద్దని చంద్రబాబు కూడా మీడియాకు హితవు పలికారు. గంటా శ్రీనివాసరావు నిన్నంతా తనతో పాటే ఉంటే ఆయన జగనను కలిశారనీ లోటస్ పాండ్కు వెళ్ళారని వార్తలు ప్రసారం చేయడమేంటని మీడియాను ప్రశ్నించారు.
మరోవైపు గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి పోటీ చేస్తారా లోక్సభ బరిలో ఉంటారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు సూచిస్తుండగా ఎమ్మెల్యే సీటు కోసం గంటా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. భీమిలి, అనకాపల్లి, విశాఖ నార్త్లో ఏదో ఒక సీటు ఇవ్వాలని గంటా శ్రీనివాస్ కోరుతున్నట్టు సమాచారం.