తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో పార్టీల మధ్య విబేధాలు ఉంటాయని, అందులో కలుగచేసుకోవద్దని కేసీఆర్ను కోరారు పవన్. ఎక్కడైనా సరే రాజ్యాల మధ్య విరోధం ఉంటుంది కానీ, ప్రజల మధ్య ఉండదని, కుదిరితే కేసీఆర్ ఆంధ్రులకు అండగా ఉండాలి కానీ ప్రజల మధ్య విరోధం పెంచకూడదన్నారు పవన్ కల్యాణ్. మళ్లీ పాతగొడవలు లేపొద్దు. దయచేసి ఆంధ్రులను వదిలేయండి. మీకు దండంపెడతా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీని ఛీకొట్టిన తెలంగాణ నాయకులను ఏపీకి తీసుకురావొద్దని జగన్కు సూచించారు పవన్. ఆంధ్రుల అభిమానం దెబ్బతీసిన వ్యక్తితో కలిసి ఆంధ్రుల గౌరవాన్ని ఎలా కాపడగలరని ప్రశ్నించారు. కావాలంటే ఏపీలో చంద్రబాబు, జగన్తో పాటు తాను కలిపి ముగ్గురం పోటీ చేద్దామన్నారు. బీజేపీ ఆంధ్రులకు నమ్మక ద్రోహం చేసిందని, బీజేపీ దొంగదారిలో వైసీపీ అండగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. సీఎం చంద్రబాబు పదే పదే మాటలు మార్చినందుకు చంద్రబాబు పశ్చాత్తాపపడాలి. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలిచేయొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు.