ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారం జరుగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. ఇక జగిత్యాలలో ఆటోలో తరలించిన ఈవీఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్కుమార్ స్పష్టంచేశారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
స్ట్రాంగ్ రూమ్లో ఫొటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ వ్యక్తిపై న్యాయ విచారణ జరుగుతోందన్నారు. స్ట్రాంగ్రూం నుంచి వీవీప్యాట్లు బయటకు తీసుకువచ్చే ముందు ఆ కాపీలను సరిచూస్తాం. ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఆరోపణలు చేసేటప్పుడు ఫారం-17సీ ఎందుకు సరిచూడరన్నారు. పోలింగ్ పూర్తైన తర్వాత ఫారం-17ఏ, ఫారం-17సీ ని సరిచూసి నమోదు చేస్తారని రజత్ కుమార్ తెలిపారు.