ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి 15రోజులుగా చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక కోలుకుంది. మధులిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు తెలిపారు. 14 కత్తి గాయాలతో ఆస్పత్రిలో చేరిన మధులికకు మొత్తం 7 మేజర్ సర్జరీలు చేశారు. మధులిక ఆరోగ్యం కుదుటపడడంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రత్యేక అంబులెన్స్లో మధులికను హాస్పిటల్ నుంచి ఇంటికి తరలించారు. మధులిక వైద్య చికిత్సకు 10 లక్షల రూపాయలు ఖర్చు కాగా అందులో 5లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారు.
ప్రభుత్వానికి, వైద్యులకు, మీడియాకి మధులిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మధులిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ తమకు కౌన్సెలింగ్ ఇచ్చారని, శనివారం మరోసారి హాస్పిటల్కు తీసుకురమ్మని చెప్పారని తండ్రి రాములు తెలిపారు. దాడికి పాల్పడిన భరత్ని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతనికి ఉరిశిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరాడు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మధులిక మీడియాతో మాట్లాడింది. తనపై దాడికి పాల్పడిన భరత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మరో అమ్మాయికి ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని మధులిక కోరింది.