ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజికి చేరుకుంది. మలివిడత ఓట్ల పండగకు దేశం సిద్ధమైంది. మొత్తం 97 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దళితుల ఓటు బ్యాంక్ కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్నాధ్ కోవింద్కు అవకాశం ఇచ్చారు. గత2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దీని ద్వారా లబ్ధిపొందారు అని వ్యాఖ్యానించారు. అయితే భారతీయ జనత పార్టీలో కీలకనేతైన ఎల్కే అద్వానీని పక్కకి తొసిపుచ్చి కేవలం ఓట్ల కోసమే కోవింద్ను నియమించారని అభిప్రాయపడ్డారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే ఫలితాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న సందర్భంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సలహా మేరకు కోవింద్ను రాష్ట్రపతి చేశారని పేర్కొన్నారు. కేవలం రామ్నాధ్ కోవింద్ దళితుడు కావడం మూలంగానే రాష్ట్రపతి కాగలికారని అన్నారు. కాగా గెహ్లోత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. దళితులను కించపరిచే విధంగా అశోక్ మాట్లాడారని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.