దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ భారత్కు పాక్ అప్పగించింది. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించారు. వాఘా బార్డర్లో ఐదుగురు ఐఏఎఫ్ అధికారులు అభినందన్ను రిసీవ్ చేసుకున్నారు. కాసేపట్లో ఐఏఎఫ్ అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో అభినందన్ను అప్పగించినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. వాఘా సరిహద్దుకు అభినందన్ చేరుకున్న నేపథ్యంలో ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది జైహిందు, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. మువ్వన్నెల జెండాలతో హర్షం వ్యక్తం చేసి ఘన స్వాగతం పలికారు. ఆనందంతో పలువురు నృత్యాలు చేశారు. అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన్ని దిల్లీకి తరలించే అవకాశం ఉంది.