జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతిచెందినట్టు పాకిస్థాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో రావల్పిండి సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆరోగ్యం విషమించి అతను మృతిచెందారని పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఈ నెల 2 వ తేదీన చనిపోయారని వారు చెబుతున్నారు. అయితే ఈ సమాచారాన్ని భారత్ నమ్మడం లేదు. ఉగ్రవాద హిట్ లిస్టులో అతన్ని తప్పించడానికి పాక్ ఆడుతున్న నాటకంగా భారత్ భావిస్తోంది. కాగా మసూద్ అజర్ పాకిస్తాన్లోనే ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కూడా అధికారికంగా రెండు రోజుల క్రితం ధ్రువీకరించారు. అతడు పూర్తి అనారోగ్యంతో ఉన్నాడని..
ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడని ప్రకటించారు. ఇదిలావుంటే అతని పూర్తిపేరు మౌలానా మసూద్ అజహర్... కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు. భారత్ అంటే విపరీతమైన ద్వేషం ప్రదర్శించే మసూద్ అజహర్ భారత్ లో అనేక ఉగ్రదాడులకు కారకుడు. కశ్మీర్ కోసం భారత్ ను అస్థిరతకు గురిచేయడమే అతడి ఏకైక అజెండా. అందుకోసం ఎంత దారుణానికైనా తెగిస్తాడు. 1994లో పోర్చుగీస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు భారత్ భద్రత బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఆ తరువాత అనూహ్యంగా తప్పించుకున్నాడు.