తెలంగాణ మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు మరోసారి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా చేసిన కృషిని ఎవరూ కాదనలేరన్నారు. సోనియా వల్లే తెలంగాణ కల సాకారం అయ్యిందని, కాదన్న వారు మూర్ఖులని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ అన్న మాటలను ఉత్తమ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘సోనియా గురించి అసెంబ్లీలో మీ నాన్న కేసీఆర్ అన్న మాటలు విను’ అంటూ ఉత్తమ్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ఓ వ్యాఖ్య పెనుదుమారాన్ని రేపుతోంది. తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు...బొమ్మా కాదని, తెలంగాణను తాము పోరాడి సాధించుకున్నామంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.