ఏడాదిలో మూడోసారి అమెరికా ప్రభుత్వం షట్డౌన్కు గురైంది. మరో మూడు రోజుల్లో క్రిస్మస్ ఉన్న సమయంలో ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో అమెరికా పౌరులు, 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడంతో తాజాగా మూడో సారి షట్డౌన్కు గురయ్యింది. నిధుల విడుదలపై ట్రంప్, డెమోక్రాట్ల మధ్య చర్చలు జరిగినా రాజీ కుదరలేదు. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచి అమెరికా ప్రభుత్వంలో నగదు లావాదేవీలు స్తంభించాయి. తాజా ఘటనల నేపధ్యంలో ఆర్థిక ఖజానా మూతపడింది. దీంతో కేబినెట్ స్థాయిలోని 15 విభాగాల్లో తొమ్మిదింటికి నిధుల విడుదల నిలిచిపోయింది. డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సి వచ్చిందంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.