మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తాచాటింది. 16 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 10 స్థానాలను కైవసం చేసుకున్నది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాగా కాంగ్రెస్, బీజేపీ చెరి రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన 16 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరిగింది. శనివారం వెలువడిన ఫలితాల్లో.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెట్నూరు(సిర్పూర్ మండలం), కోరుట్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్, కొత్తగూడెం భద్రాచలం జిల్లా భద్రాచలం–7, ఖమ్మం జిల్లా జక్కెపల్లి (కుసుమంచి మండలం), మహబూబ్నగర్ జిల్లా కన్మనూరు (నార్వ మండలం), వనపర్తి జిల్లా గోపైదిన్నె (పానగల్ మండలం), నల్లగొండ జిల్లా కిష్టాపురం (మునుగోడు మండలం), ఎర్రబెల్లి (నిడ్మనూరు), రంగారెడ్డి జిల్లా జాన్వాడ (శంకరపల్లి మండలం) స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది.
కరీంనగర్ జిల్లా అచ్చంపల్లి (గంగాధర మండలం), సిద్దిపేట జిల్లా అకునూర్–1(చెర్యాల మండలం) స్థానాలను కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా గంగాధర, కామారెడ్డి జిల్లా మద్నూరు–2 స్థానాలను బీజేపీ, మహబూబ్నగర్ జిల్లా లింగంపల్లి (మక్తల్ మండలం), రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడ (శంషాబాద్ మండలం) స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజ యం పట్ల మంత్రులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎంపీటీసీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టాయని గెలుపొందిన అభ్యర్థులు పేర్కొన్నారు.