ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు. అలాగే నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు. ఉద్యోగాలు లేవని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకించినవారు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారని మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు.