తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులకు, టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిపోయిందని విమర్శించారు. తప్పులు, అక్రమాలు చేసినందుకు సోదాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ను విమర్శించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. రేవంత్రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈ విషయానికి టీఆర్ఎస్కు సంబంధం లేదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్రెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగడంలేదే.. అన్నారు. వందల, వేల కోట్ల ఆస్తులు రేవంత్రెడ్డికి ఎలా వచ్చాయని, రేవంత్రెడ్డి ఒక దేశ ద్రోహి అని, ఇతని వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ను కలుస్తామని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరతామన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన 50 లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని, దేశ భక్తుడినని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి హవాలా మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్ను ఎలా సమర్ధిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించి రాహుల్ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు.