మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో బీజేపీ నేతలు కంగారపడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ వివాదాలకు దారి తీసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ‘‘ఇక లేరంటూ’’ త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. క్షణాల్లో ఇది వైరల్గా మారడంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో నాలిక్కరుచుకున్న ఆయన వెంటనే సదరు ట్వీట్ను తొలగించి క్షమాపణ చెప్పారు. ‘‘క్షమించండి. ఓ ఆలిండియా టీవీ చానెల్లో వచ్చిన వార్తలను చూసి నేను అలా ట్వీట్ చేశాను. ముందు అది నిజమా కాదా అనేది తెలుసుకుని ఉండాల్సింది. వాజ్పేయిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నా ట్వీట్ను డిలీట్ చేశాను. మరోసారి క్షమించాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు.
I am sorry I tweeted something upon being told by an all-India TV channel. I had taken it to be authentic. There has so far been no official announcement. I have deleted my tweet. Sorry again
— Tathagata Roy (@tathagata2) August 16, 2018