రంగారెడ్డి జిల్లాలో ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. శంకర్పల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలు కావడంతో హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. పొలంలో పడిన విమాన శకలాలను చూసేందుకు సమీపంలో నివసిస్తున్న ప్రజలు తరలివస్తున్నారు. వాటితో ఫొటోలు దిగేందుకు పోటీపడుతున్నారు. ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమానంతో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగా బుధవారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టులో విమానంలో బయలు దేరాడు. అయితే మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం ప్రమాదానికి గురైంది. చెట్టుకు తగిలి మోకిలా గ్రామంలోని శంకరమ్మ అనే మహిళా రైతు పొలంలో కుప్పకూలింది.