నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం వద్దిపట్ల దగ్గర వ్యవసాయ కూలీలలో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా 15 మంది గాయపడ్డారు. ఎదురుగా వెళుతున్న బైక్ ను తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి AMR కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో 30 మంది వరకు కూలీలు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని చుట్టుపక్కల వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మృతులు రమావత్ సోనా, రమావత్ జీజా, జవుకుల ద్వాలి, రమావత్ కేలీ, రమావత్ కంసాలి, బాణవత్ బేరీ, రమావత్ భారతి, రమావత్ సురితలుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.