తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తీ చేయడానికి ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. అర్హత లేని పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్కి ముక్క చీవాట్లు పెట్టింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఏపీకి పోలవరం ఎంతనో తెలంగాణాకి కాళేశ్వరం ప్రాజెక్టు అంత. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తీ అయితే ఉత్తర తెలంగాణ తాగు, సాగు నీటి కష్టాలు కడతేరతాయని జల రంగ నిపుణులంటున్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారని దాఖలైన పిటిషన్కి, పిటిషనర్కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
ఇది తెలంగాణ ప్రభుత్వం విజయం. అప్రతిహాతంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తీ కావడానికి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అర్హత లేని అంశాలతో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్పై మండిపడింది. ఏదో రూపంలో పిటిషన్ను న్యాయస్థానాల్లో విచారణకు తీసుకొని రావాలనే తాపత్రయమే కనిపిస్తోందని, అందులో ప్రజా ప్రయోజనం కనిపించడం లేదని, చెన్నై బెంచ్ నుంచి ఢిల్లీ బెంచ్కి రావడంలో అదే కనిపిస్తోందని సుప్రీం కోర్టు పిటిషనర్కి తలంటింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాద్ధాంతానికి సుప్రీం కోర్టు సరైన సమాధానం చెప్పిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణాలో ప్రాజెక్టుల నిర్మాణంపై కాంగ్రెస్ నాయకులు వందకు పైగా కేసులు వేశారని, అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు సుప్రీం తాజా తీర్పుతో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులు పనులు వేగంగా పూర్తీ చేయనున్నట్లు చెప్పారు మంత్రి హరీశ్రావు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ కింద రైతులకు నీరందించనున్నట్లు చెప్పారు.
సుప్రీకోర్టులో కేసు గెలిచిన విషయాన్ని స్వయంగా మంత్రి హరీశ్రావు.. సీఎం కేసీఆర్కి ఫోన్ చేసి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని కాళేశ్వరానికి అన్ని అడ్డంకులూ తొలగినట్లేనని స్పష్టం చేశారు మంత్రి హరీశ్రావు. తాజా సుప్రీం కోర్టు నేపథ్యంలో కాంగ్రెస్ కానీ, కోదండరామ్ వంటి శక్తులు కానీ తమ మైండ్ సెట్ మార్చుకోవాలని, ఇప్పటికైనా తెలంగాణా అభివృద్ధికి అడ్డుపడకుండా ఉండాలని మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు.