నేటి నుంచి శబరిమలలో పూజలు

Update: 2018-11-16 06:38 GMT

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల ఆలయంలో నేటి సాయంత్రం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ విఫలమైంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ కర్తవ్యమని గట్టిగా చెబుతున్న సీఎం విజయన్‌.. ప్రత్యేకంగా కొన్ని రోజులు 50 ఏళ్ల లోపు మహిళలను దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నామన్నారు. అయితే, రివ్యూ పిటిషన్లు సుప్రీం ముందుకు విచారణకు వచ్చే జనవరి 22 వరకు ఉత్తర్వుల అమలును ఆపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను సీఎం ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప దర్శనానికి వస్తున్న తనకు రక్షణ కల్పించాలని రాసిన లేఖకు కేరళ ప్రభుత్వం స్పందించలేదని హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ తెలిపారు.   

శబరిమల ఆలయంలోకి రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా అనుమతించాలన్న సెప్టెంబర్‌ 28వ తేదీ నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకు రెండుసార్లు ఆలయాన్ని తెరవగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలతోపాటు 16 నుంచి ప్రారంభమై రెండు నెలలపాటు కొనసాగే ‘మండల మకరవిలక్కు’ పూజల కోసం ఆలయాన్ని తెరవనుండటంతో కేరళ ప్రభుత్వం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశం బీజేపీ, కాంగ్రెస్‌ల వాకౌట్‌తో ఎలాంటి పరిష్కారం చూపకుండానే ముగిసింది.

అఖిలపక్షం అనంతరం ముఖ్యమంత్రి విజయన్‌ పండాలం రాచకుటుంబం, శబరిమల ఆలయ ప్రధాన పూజారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకమని  పండాలం రాచకుటుంబం ప్రతినిధి శశికుమార్‌ వర్మ చెప్పారు. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామన్నారు.  

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇద్దరు ఆలయ ప్రధాన పూజారులు ఎంఎల్‌ వాసుదేవన్‌ నంబూద్రి, ఎంఎన్‌ నారాయణన్‌ నంబూద్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ద్వారాలను తెరుస్తారు. అయితే, రాత్రి 9 గంటల వరకే భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. 

ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి వారంపాటు 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా తెలిపారు. ‘గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బేస్‌ క్యాంప్‌ నిలక్కల్‌ మొదలుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశామన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున 15వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

శబరిమల వెళ్లిన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ నుంచి 40 బస్సుల్లో భక్తులు శబరిమలకు తరలివెళ్లారు. అయితే, సన్నిధానానికి వెళ్లే దారిలో నిలక్కల్ వద్ద అటవీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంలో పోలీసులు బస్సులు నిలిపివేశారు. పంపా నది దగ్గర ఉన్న కన్నె మూల మహాగణపతి దగ్గర భక్తులంతా నిలిచిపోయారు. సుమారు 22గంటలు గడుస్తున్నా స్వామి దర్శనానికి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో దాదాపు 5వేల మంది భక్తులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 

Similar News