కంప్యూటర్లను శోధించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు కట్టబెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినట్లే అని విపక్షాలు గగ్గోలు పెట్టగా అందుకు ఆస్కారమే లేదని కేంద్రం వాదిస్తోంది. కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి దేశంలోని ఏ కంప్యూటర్నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కో కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, రా, డీఎస్ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ అధికారాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా సంతకం చేశారు.
ఇక ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా కల్పించారు. గతంలో అయితే వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది. కానీ ప్రస్తుతం అడ్డుకునే అధికారం కూడా కట్టబెట్టారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్ బ్రదర్లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు నేరుగా శోధించలేవని అందుకు ముందుగా హోంశాఖ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఇక ఇదే అంశంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అని.. 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వివరించారు. దీనివల్ల ఎవరి హక్కులకు భంగం కలగదని జైట్లీ చెప్పుకొచ్చారు. అయితే జైట్లీ సమాధానంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందంటూ గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. దీపిపై మరోసారి జైట్లీ సమాధానం చెబుతూ ప్రతిపక్షాలు దేశ సెక్యూరిటీ సంస్థలతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రాజ్యసభలో తీవ్ర గంధరగోళం నెలకొంది. దీంతో సభను ఈ నెల 27 వరకు వాయిదా వేశారు.